అంబేద్కర్ జయంతి రోజే భూభారతి రెవెన్యూ చట్టం అమలు?
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్:
ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈనెల 14న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేడ్కర్ జయంతి రోజున సాయంత్రం 5 గంటలకు శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని ఆవిష్కరించనున్నారు.
తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ను బంగాళాఖాతం లో కలిపినట్లు అవుతుం దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
తెలంగాణలో గత BRS ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. ఎన్నికల హామీ అమలులో భాగంగా ధరణి స్థానంలో భూభారతి పేరుతో రెవెన్యూ చట్టం- 2025 చట్టాన్ని తీసుకొచ్చింది.
మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయి అంటూ నాలుగు అంచల్లో ధరణి పోర్టల్కు చెందిన సమస్యల పరిష్కారానికి అవకాశం ఇచ్చింది. ఫలితంగా సాధా బైనామాలు మినహా ధరణి సమస్యలు దాదాపు సమసి పోయాయని అధికారులు చెబుతున్నారు.
సాఫ్ట్వేర్ మార్చేందుకే 4 నెలలు : అయితే గత డిసెంబర్ నెలలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సాప్ట్వేర్ మార్చేందుకు దాదాపు నాలుగు నెలలు పట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
చట్టం అమలుకు అవసరమైన నిబంధనలు కూడా రూపకల్పన కావడంతో చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెల 14 సాయంత్రం 5 గంటలకు హైటెక్ సిటీ శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతిని ప్రజలకు అంకితం చేస్తారు.
రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
