కష్టాల్లో ఐటీ పరిశ్రమ.. వృద్ధి అవకాశాలు అంతంత మాత్రమే..
అమెరికా ఆర్థిక పరిస్థితుల ప్రభావం..!
వెంటాడుతున్న టారిఫ్ భయాలు..
వ్యయ నియంత్రణ దిశగా క్లయింట్లు..
దేశీయ సంస్థల లాభాలకు గండి..!!
ప్రతికూలంగా అంతర్జాతీయ మార్కెట్..
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ ఇంటర్నెట్ డెస్క్/ మార్చి 22: భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) కష్టాలేనన్న అభిప్రాయాలు పరిశ్రమ విశ్లేషకుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా పేలవమైన ప్రదర్శనను ఇచ్చిన రంగాల్లో ఐటీ రంగం కూడా ఒకటిగా ఉన్నది. ఈ క్రమంలో ఇండస్ట్రీ అనలిస్టుల అంచనాలు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుండగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ త్రైమాసిక నివేదిక కూడా ఆ అంచనాలకు బలం చేకూరుస్తున్నది. తాజాగా విడుదలైన ఈ రిపోర్టులో ఐటీ కంపెనీల కస్టమర్లు వ్యయ నియంత్రణ దిశగా వెళ్తున్నారని, దీంతో మున్ముందు ఐటీ ప్రాజెక్టులకు డిమాండ్ అంతంతేనని యాక్సెంచర్ పేర్కొన్నది మరి.
అమెరికాలో ఆగమాగం..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా భావించే అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. ఎన్నో అంచనాల నడుమ అధ్యక్ష పీఠం ఎక్కిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు అంతటా వినిపిస్తుండటం గమనార్హం. ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలకు పట్టుబడుతున్న ట్రంప్ అందుకు డెడ్లైన్ కూడా పెట్టుకున్నారు. వచ్చే నెల నుంచి భారత్, చైనా సహా ఐరోపా, ఇతర దేశాలపై అధిక సుంకాలుంటాయని ఇప్పటికే తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఇది అమెరికా జీడీపీలో మంద గమనానికి దారితీస్తున్నది. ట్రంప్ చర్యలతో అమెరికాలోకి దిగుమతయ్యే వస్తూత్పత్తుల ధరలు పెరుగుతాయన్న గుబులు అక్కడివారిలో పట్టుకున్నది. ఈ పరిణామం మార్కెట్లో కొనుగోలు శక్తిని బలహీనపరుస్తుండగా కంపెనీల పెట్టు బడులు, ఖర్చులనూ పునరాలోచనలో పడేస్తున్నది. భారతీయ ఐటీ కంపెనీల ఆదాయంలో మెజారిటీ వాటా అమెరికా మార్కెట్ నుంచే వస్తుందన్న సంగతి విదితమే. దీంతో అక్కడి క్లయింట్లు తమ బడ్జెట్ను తగ్గిస్తుండటం ఇండియన్ ఐటీ సంస్థల కొత్త ప్రాజెక్టులను దెబ్బ తీస్తున్నది. యాక్సెంచర్ తాజా నివేదికలోనూ ఇవే సంకేతాలున్నాయి.
కొలువులకు కోతలు
ఆదాయానికి తగ్గట్టు ఐటీ కంపెనీలు తమ ఖర్చులనూ తగ్గించుకునే పనిలో పడుతున్నాయి. ఇప్పటికే కొత్త నియామకాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న ఆయా సంస్థలు అమెరికా, ఐరోపా మార్కెట్లలో వ్యాపారం తగ్గిపోతే ఉన్న ఉద్యోగులనూ తొలగించేస్తాయన్న అంచనాలు ఇప్పుడు బయలుదేరుతున్నాయి. ఈ ఏడాదిలో భారతీయ ఐటీ సూచీ 15.3 శాతం పడిపోవడం కూడా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. 2022 జూన్ నుంచి ఇదే అత్యంత ప్రతికూల త్రైమాసికమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్టెక్ వంటి అగ్రశ్రేణి కంపెనీలపై అమెరికా పరిణామాల ప్రభావం ఎక్కువగా ఉంటున్నది. అమెరికా వీసా నిబంధనల కఠినతరం కూడా ఐటీ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నది. బలపడుతున్న రూపీ కూడా ఐటీ లాభాలకు గండి కొడుతున్నది. మొత్తానికి వచ్చే ఏడాది కాలం ఐటీ సంస్థలకు గడ్డు కాలమేననిపిస్తున్నది.
ఐటీ రంగంలో మందగమనం ఛాయలు?
నెమ్మదించిన రికవరీ, మితంగానే వృద్ధి..
గతకొంత కాలంగా పరిమితంగానే వృద్ధిరేటు ఉంటోందంటున్న పరిశ్రమ విశ్లేషకులు
స్థూల ఆర్థిక వ్యవస్థలోని సవాళ్లతో క్రమేణా మందగిస్తున్న ఐటీ రంగ కార్యకలాపాలు
అయోమయంలో ఐటీ కంపెనీలు..
ఐటీ సంస్థలు ప్రకటిస్తున్న వృద్ధి అవకాశాల్లో పెరుగుతున్న వ్యత్యాసాలు స్వల్పకాలిక వృద్ధి అంచనాల్లోనూ పరివర్తనలు స్టాక్ మార్కెట్ ప్రభావం.
ఐటీ షేర్లలో 6-18 శాతం దిద్దుబాటు వృద్ధి అంచనాలతో అమ్మకాల ఒత్తిడిలో ఐటీ షేర్లు వేగంగా పెట్టుబడుల ఉప సంహరణలకు దిగుతున్న మదు పరులు విదేశీ మదు పరులూ ఐటీ కంపెనీలకు దూరం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు.
భారతీయ ఐటీకున్న డిమాండ్ను ప్రభావితం చేస్తున్న అమెరికా జీడీపీ పతనం..
డాలర్తో పోల్చితే బలపడుతున్న రూపాయి మారకం విలువ వల్ల పడిపోతున్న లాభాలు, క్షీణిస్తున్న అమెరికా పదేండ్ల బాండ్ ఈల్డ్స్, అంచనాలకు మించి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలతో దెబ్బే, వచ్చే ఏడాది మార్చిదాకా నిరాశే..
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను వృద్ధి అంచనా 4.5 శాతమే
2026-27లో 6 శాతం వృద్ధికి అవకాశాలు
