ఇంటర్ విద్యలో నూతన సంస్కరణలు
విద్యార్థులకు నీట్, జేఈఈ మెయిన్స్ లో శిక్షణ?
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/ఫిబ్రవరి 03: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులకు జేఈఈలో రాణించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రత్యేక దృష్టి సారించారు.
ఇందులో భాగంగా తొలుత గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని 29 ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఎంపిక చేశారు. వీటిల్లో చదువుతున్న మొత్తం 1800 మంది విద్యార్థులకు చెన్నైలోని ఐఐటీ ప్రొఫెసర్లతో ఆన్లైన్ క్లాసులు చెప్పిస్తున్నారు.
ఈ మేరకు గత ఏడాది డిసెంబరు నెల నుంచి స్థానిక అధ్యాపకుల పర్యవేక్షణలో ప్రతిరోజూ జేఈఈ మెయిన్ ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయి. విద్యార్ధులకు ఇస్తున్న జేఈఈ మెయిన్ కోచింగ్కు రాష్ట్ర ప్రభుత్వం ‘విద్యాశక్తి’గా నామకరణం చేసింది.
ఆయా కాలేజీల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల పాటు జేఈఈ పాఠాలను వర్చువల్ లెవల్లో బోధిస్తున్నారు. ఎంతో కఠినమైన జేఈఈ క్రాక్ చేయాలంటే శిక్షణ తప్పని సరిగా అవసరమని శిక్షణతోనే జేఈఈ రాసేం దుకు ఎక్కువ మంది విద్యార్ధులు ఆసక్తి చూపిస్తున్నారని గుంటూరులోని బాలికల జూనియర్ కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ చొరవతో పేదింటి విద్యార్ధులకు ఉన్నత చదువులు చదివేందుకు మార్గం సుగమం అవుతోంది.
కాగా ఎంతో కఠినమైన జేఈఈ పరీక్ష ఆల్ ఇండియా స్థాయిలో జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను ప్రతీయేట రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఈ ఏడాదికి తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్ష పూర్తికాగా ప్రస్తుతం తుది విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తున్నారు.
